మహారాష్ట్ర ఔరంగాబాద్లో రోడ్డు ప్రమాదం... నలుగురు అన్నదమ్ములు మృతి
Maharashtra: బంధువు అంత్యక్రియలకు వచ్చి మృత్యుఒడికి
Maharashtra: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటుపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు చనిపోయారు. చనిపోయిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కృష్ణ, సురేష్, వాసు, సంజీవ్ గా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అన్నదమ్ములు నలుగురు బతుకు దెరువు కోసం సూరత్ వెళ్లారు. స్వగ్రామం చౌటుపల్లిలో బంధువు కనుకయ్య మృతి చెందారు.
అంత్యక్రియల కోసం నలుగురు చౌటుపల్లికి వచ్చారు. కుటుంబ సభ్యులను చౌటుపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి సూరత్ కు మంగళవారం కారులో బయలుదేరారు. రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.