ముంబైలో రెడ్ అలర్ట్..

Update: 2019-07-29 05:00 GMT

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై వరుణుడు పగబట్టాడు. ఎడతెరపి లేకుండా రోజుల తరబడి వర్షాలు పడటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోగా.. వచ్చే 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ముంబై, థానే, పూణేల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో బీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వరద సహాయక చర్యలను మరింత ఉధృతం చేశారు. ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. రోడ్డు మార్గాలు దెబ్బతినడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిలిపివేశారు. పలురైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. హదరాబాద్ ముంబై హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్, నాందేడ్ పన్వేల్ ఎక్స్‌ప్రెస్‌లను 28, 29 తేదీల్లో రెండు వైపులా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. నిజామాబాద్- పాందర్‌పూర్ ప్యాసింజర్, రాజ్‌కోట్- కోయంబత్తూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఈ మార్గంలో ప్రయాణించే మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పింది. అలాగే పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. 

Tags:    

Similar News