కరోనా ఎఫెక్ట్ : రాజ్యసభ ఎన్నికలు వాయిదా
ఈనెల 24 న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది.
ఈనెల 24 న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది. వాస్తవానికి ఏప్రిల్ 9తో పదవీ కాలం పూర్తయిన రాజ్యసభ సభ్యుల స్థానాలకు నిర్వహించాల్సిన ద్వైవార్షిక ఎన్నికలను గత నెల 26 న జరపాలని నిర్ణయించింది. అయితే దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న వాయిదావేస్తూ ప్రకటన జారీ చేసింది.
అయితే రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై మరోసారి సమీక్ష జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇంకా కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్టు తాజాగా మరో ప్రకటన చేసింది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చక్కబడిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని ఈసీ వివరించింది. ఎన్నికలు నిర్వహించే తేదీని తరువాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కాగా మొత్తం 55 స్థానాలకు గాను 37 స్థానాల్లో పోటీ లేకుండా ఎన్నిక పూర్తయింది. కాగా మరో 18 స్థానాల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. ఏపీలో 4, గుజరాత్ లో 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 3, ఝార్ఖండ్ లో 2, మణిపూర్ లో 1, మేఘాలయలో 1 స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉందని ఈసీ వెల్లడించింది.
ఇక 37 చోట్ల ఎన్నికలు అవసరం లేకుండా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా వారిలో.. ప్రధానంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, బీహార్, తెలంగాణ, ఒడిశా, హర్యాణా, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో.. రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.