కొన్ని రోజుల క్రితం వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫాస్టాగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అమలులో ఉన్న హైబ్రిడ్ విధానాన్ని బుధవారం నుంచి తొలగిస్తున్నట్టు ఎన్ హెచ్ఏఐ రాష్ట్ర ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. కేంద్ర రవాణా శాఖ స్పష్టమైన హామీ ఇవ్వనందునే దీన్ని తొలగిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి నగదు చెల్లించే వాహనాలకు ఒక్కోవైపు రహదారి మాత్రమే అందుబాటులో ఉండనుంది. హైబ్రిడ్ విధానంలో 25% లేన్లు నగదు చెల్లించే వాహనాలకు కేటాయించగా, ఫాస్టాగ్ వాహనాలకు మిగతావి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత హైబ్రిడ్ విధానం గడువు మంగళవారంతో తీరిపోయింది.
ఇక సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణికులు రాక పోకలను సాగిస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు ముందుకు సాగాయి. ఎక్కువ రద్దీ ఉన్న టోల్ ప్లాజాల వద్ద మాత్రమే కొంత మేర వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పంతంగి లాంటి రద్దీ ఎక్కువగా ఉండే టోల్ప్లాజాల వద్ద కాస్త రద్దీ ఏర్పడింది.
ఇక పోతే పండగకు తమ స్వగ్రామాలకు వెళ్లిన వారికి ఈ ఇబ్బంది కలగక పోయినప్పటికీ తిరిగి పట్టణాలకు వచ్చేటప్పుడు మాత్రం వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పేట్టుగా లేవు. ఈ సారి దాదాపు 35 లక్షల మంది వారి సొంత గ్రామాలకు వెళ్లినట్టు అంచనా. అంతే కాక సంక్రాంతి సమయంలో టోల్గేట్ల వద్ద నమోదైన లెక్కల ప్రకారం 55% వాహనాలకు ఫాస్టాగ్ ఉందని, 45% వాహనాలకు టోల్ను నగదు రూపంలో చెల్లించారని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఈ 45% వాహనాల తిరుగు ప్రయాణంలో ఆ 'ఒక్కోవైపు 'నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉంటే కలిగితే అప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి పొంది లేన్ల సంఖ్యను పెంచే ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు.