PM Modi: నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 6 రోజుల్లో 3 దేశాలు చుట్టేయనున్న పీఎం
PM Modi: జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా దేశాల్లో సుడిగాలి పర్యటన
PM Modi: నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 6 రోజుల్లో 3 దేశాలు చుట్టేయనున్న పీఎం
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. 6 రోజుల్లో మూడు దేశాల సందర్శించనున్నారు. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా దేశాల్లో సుడిగాలి పర్యటన చేస్తారు ప్రధాని మోదీ. క్వాడ్ సదస్సు రద్దైనా ఆస్ట్రేలియా సందర్శించాలని నిర్ణయించుకున్నారు ప్రధాని. దాదాపు 25 మందికి పైగా ప్రపంచ నాయకులతో భేటీ కానున్నారు. ఇక విదేశీ పర్యటనలో భాగంగా 40 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన సంపూర్ణం, చారిత్రాత్మకమని పీఎంవో అభివర్ణించింది.
మూడు దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన సాగనుంది. ముందుగా జపాన్లోని హిరోషిమాలో జరిగే G7 సమావేశంలో పాల్గొంటారు. కీలకమైన G7 గ్రూప్లో భారత్ సభ్య దేశం కానప్పటికీ అతిధి దేశంగా పాల్గొనాలని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఇండియాను ఆహ్వానించారు. G7 గ్రూప్కు ప్రస్తుతం జపాన్ అధ్యక్షత వహిస్తోంది. G7 గ్రూప్లో ప్రధాని మోదీ పాల్గొనడం ద్వారా G7, G20 దేశాల మధ్య బంధం బలపడుతుందని జపాన్ భావిస్తోంది.
మరో వైపు ఆస్ట్రేలియాలో ఈ నెల 24న జరగాల్సిన క్వాడ్ సదస్సు వాయిదా పడటంతో హిరోషిమాలోనే క్వాడ్ దేశాధినేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భారత్ భావిస్తోంది. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ పాపువా న్యూ గినియా దేశాన్ని సందర్శిస్తారు. భారత ప్రధాని ఒకరు పాపువా న్యూ గినియా దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. అక్కడ ఇండో-పసిఫిక్ దీవుల సహకార ఫోరమ్ మూడో శిఖరాగ్ర సదస్సుల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ ఫోరమ్ను 2014లో ఏర్పాటు చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో 14 దీవులు, దేశాలు సభ్యులుగా ఉన్నాయి.