కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల అధ్యక్షతన ప్రీ-బడ్జెట్ సమావేశం
*హాజరైన అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు, కార్యదర్శులు
Budget 2023-24: కేంద్ర బడ్జెట్ 2023- 24 కసరత్తు ప్రారంభమైంది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశం జరుగుతోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్ధిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. అయితే తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. సీఎం కేసీఆర్ ఏకంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి తరుణంతో హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు సీఎం కేసీఆర్తో ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న సమావేశానికి హరీష్ రావు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై ప్రగతిభవన్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.