చెన్నై విమానాశ్రయానికి విమానం హైజాక్ బెదిరింపులు రావడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. తీవ్ర తనిఖీల అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సందర్శకులను అనుమతి లేదని వారంటున్నారు. కాగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను దాదాపు 300 మందిని మట్టుబెట్టింది.
దీంతో తీవ్రవాదులు భారత్లో దాడులు జరపవచ్చని హెచ్చరికలు అందాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు బెదిరింపులు అందాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాలపై దాడులు జరిపేందుకు తీవ్రవాదులు ప్రయత్నించవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై విమానాశ్రయానికి హైజాక్ బెదిరింపులు రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.