Oxygen Express Rail: వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు బయలుదేరిన 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్'

Oxygen Express Rail: విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తొలి 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు' గత రాత్రి మహారాష్ట్రకు బయలుదేరింది.

Update: 2021-04-23 03:22 GMT

Oxygen Express Rail:(File Image)

Oxygen Express Rail: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్రలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా వైరస్ రెండో దశ ఉద్ధృతమైన నేపథ్యంలో సరిపడా ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న మహారాష్ట్రలో ఆక్సిజన్ అవసరం మరింత ఎక్కువగా ఉంది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తొలి 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు' గత రాత్రి మహారాష్ట్రకు బయలుదేరింది. ఈ రైలు త్వరితగతిన గమ్యానికి చేరేలా అధికారులు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు.

సోమవారం రాత్రి కలంబోలి నుంచి ఏడు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో బయలుదేరిన రైలు రెండు రోజులు ప్రయాణించి నిన్న తెల్లవారుజామున వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుంది. అక్కడి సిబ్బంది ట్యాంకర్లను కిందికి దించి వాటిలో ఆక్సిజన్ నింపి తిరిగి రైలుపైకి ఎక్కించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించారు. నాలుగు ట్యాంకర్లలో 16 టన్నుల చొప్పున, మూడు ట్యాంకర్లలో 13 టన్నుల చొప్పున మొత్తం 103 టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను నింపి తొలివిడతగా మహారాష్ట్రకు పంపారు. దాదాపు 15 గంటలకు పైగా కొనసాగిన ప్రక్రియను ఉక్కు పరిశ్రమ సీఎండీ పీకే.రథ్‌, వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం శ్రీవాస్తవ పర్యవేక్షించారు. ఆక్సిజన్‌ రైలు ప్రయాణానికి తూర్పు కోస్తారైల్వే గ్రీన్‌ ఛానల్‌ మార్గం కల్పించింది.అనంతరం రైలు మళ్లీ మహారాష్ట్రకు బయలుదేరింది. ప్రాణవాయువును మోసుకుని రైలు బయలుదేరిన వెంటనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News