నిర్భయ నిందితులకు జనవరి 7న ఢిల్లీలోని పటియాలా కోర్టు జడ్జి సతీశ్ అరోరా డెత్ వారెంట్ జారీ చేసారు. నిర్భయ ఉదంతం జరిగి ఇప్పటికే ఏడేల్లు గడిచింది. అర్ధరాత్రి ఆడపిల్లపై నలుగురు కీచకులు బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత అత్యంత పాశవికంగా, హృదయవిదారకంగా రోడ్డుపై వదిలేసి వెళ్లారు.
దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు 2020 జనవరి 7 వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అప్పటి నుంచి నిందితులకు ప్రాణభయం పట్టుకుందని, సమయానికి తినకుండా ఆందోళనగా ఉంటున్నారని తీహార్ జైలు అధికారులు తెలిపారు. ఈ భయంతోనే నిందితుడు వినయ్ శర్మ తన సెల్లో విరామం లేకుండా నడుస్తున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి.
నిందితుల వ్యక్తి గత జీవిత వివరాలకొస్తే 2015లో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు వినయ్ శర్మ ప్రవేశం పొందాడన్నారు. ఇక ముకేశ్, పవన్, అక్షయ్ పదో తరగతి పరీక్షలు రాశారు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారని తెలిపారు. వారంతా చదువుల్లో ఎంతో వెనకబడి వున్నారని, సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలో అన్న విషయాలను కూడా తెలుసుకోలేకపోయారన్నారు.
నేరం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ నిందితులు జైల్లోనే ఉంటున్నారని. ఈ ఏడేళ్ల కాలంలో దోషులు దాదాపుగా 28 సార్లు జైలులో పాటించవలసిన నిబంధనలను అతిక్రమించారని సిబ్బంది స్పష్టం చేసారు. అందుకు గాను జైలు సిబ్బంది దోషులకు ప్రత్యేకంగా శిక్షను విధించారన్నారు. అందులో భాగంగానే గదులను మార్చడం, తమ వారిని కలుసుకునే అవకాశాలను తగ్గించామని తెలిపారు. ఇప్పటి వరకూ వినయ్శర్మకు 11 సార్లు పవన్కు 8 సార్లు, ముకేశ్కు 3 సార్లు, అక్షయ్కుమార్కు ఒకసారి ఇలాంటి శిక్షలు అనుభవించారని తెలిపారు. ఇక పోతే నిందితులు దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటిషన్ ను కోర్టు కొట్టేయడంతో ఉరిశిక్షకు ముందు దోషులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా వారిని ఎప్పుడు కలుసుకోవాలనుకుంటున్నారని జైలు సిబ్బంది దోషులను అడగ్గా వారు ఎలాంటి సమాధానం చెప్పలేదని జైలు అధికారులు వెల్లడించారు. దీంతో జైలు అధికారులు దోషుల కుటుంబసభ్యులను ఎప్పుడు కలవాలనే తేదీని నిర్ణయించనున్నారని తెలిపారు.
ఇకపోతే నిందితులు జైల్లో పని చేసి సంపాదించిన సంపాదన విషయానికొస్తే ఇప్పటివరకూ నిందితుల్లో ముగ్గురు రోజు వారి పనులను చేసి రూ.1.37లక్షలు సంపాదించారని తెలిపారు. అక్షయ్ జైల్లో పని చేసి రూ.69వేలు సంపాదించగా, పవన్ రూ.29వేలు, వినయ్ రూ.39వేలు సంపాదించారన్నారు. ముకేశ్ మాత్రం ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉండేవాడని తెలిపారు. వారి ఉరి శిక్ష అనంతరం ఆ డబ్బులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు.
ఉరి శిక్ష ఖరారు కావడంతో నలుగురు నిందితుకు ప్రతిరోజు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను రికార్డు చేస్తున్నారని తెలిపారు. వాళ్లని ఉంచి సెల్ పరిసరాల్లో ముగ్గురు నుంచి నలుగురు సెక్యూరిటీ గార్డులను కాపలాగా ఉంచారు. 24 గంటల పాటు నీసీటీవీ కెమెరాల ద్వారా వారి కదలికలను గమనిస్తున్నారని తెలిపారు. వాళ్లని ఉంచిన గదిలో ఫ్యాన్ సౌకర్యం కూడా లేదని జైలు వర్గాలు వెల్లడించాయి.
దోషులను ఉరి తీయడానికి కౌంట్ డౌన్ మొదలవడంతో ఉరితీతకు సంబంధించిన ట్రయల్స్ను జైలు సిబ్బంది నిర్వహించారు. ఉరి తీయడానికి ముందు రోజు కూడా మరోసారి ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ఉరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, తలారీ కూడా సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. మేరట్కు చెందిన పవన్ ఆ నలుగురిని ఉరితీయనున్నాడు. అందుకు గాను అతనికి రూ.15వేలు జైలు అధికారులు ఇస్తారని తెలిపారు..