కరోనా.. 3 నెలల ముందు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించేస్తోంది. ప్రతి ఒక్కరిలో దడ పుట్టిస్తోంది. కరోనాకు ముందుమన జీవితం వేరు. అది ఎంటరయ్యాక మనం చూస్తున్న లైఫ్ వేరు. తిండి, ఖర్చులు, అప్పులు ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి జీవితాలనే మార్చేసింది. ఇవన్నీచిన్న మార్పులే. కానీ, వాటి ఎఫెక్ట్ మాత్రం బడుగువర్గాలపై పెద్ద ప్రభావం చూపుతోంది. దానంతటికీ కారణం మహమ్మారి కరోనా. ఇలాంటి చిన్నచిన్న మార్పులే కాదు. పెద్ద పెద్ద మార్పులకు ముందు ముందు ఈ మహమ్మారి బాటలు వేస్తుందని సామాన్యుడు భయపడుతున్నాడు.
కరోనా వైరస్ సామాన్యుల జీవితాలపై బలమైన ముద్ర వేస్తోంది. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అన్నట్లుగా జీవనవిధానాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఒకప్పుడు లేచింది మొదలు హడావుడి, పిల్లల్ని ఉదయమే బడికి పంపించడం, ఉరుకులు పరుగులతో ఉద్యోగాలకు వారాంతం వస్తే సినిమాలు, షాపింగ్లు, అప్పుడప్పుడు ఆన్లైన్లోఫుడ్ ఆర్డర్లు విందూ వినోదాలు ఇదీ కరోనా ముందు పలు కుటుంబాల జీవనశైలి. మహమ్మారి రాకతో పరిస్థితి తలకిందులైంది. అంతా ఇంటిపట్టునే. ఆహారపు అలవాట్లు, అభిరుచులు మారాయి. ఆరోగ్య జాగ్రత్తలు పెరిగాయి. అదే సమయంలో నెలవారీ ఖర్చులు తారుమారవుతున్నాయి.
కరోనా ఎఫెక్ట్తో సామాన్య, మధ్యతరగతి వారి ఇంటి బడ్జెట్ డబుల్గా పెరిగిపోయింది. ఏ రోజుకారోజు కష్టించి బతుకుబండి లాగేవారిని మాత్రం కరోనా కాటేస్తోంది. రూపాయి ఆదాయం లేకపోగా పెరిగిన ఖర్చులతో అప్పులపాలవుతున్నట్లు సగటు జీవి ఆందోళన చెందుతున్నాడు. బయటి ఖర్చులు తగ్గాయని కరోనా దెబ్బతో నూనెలు, చింతపండు, బియ్యం, చికెన్, మటన్ ధరలు పెరుగుతూ ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపుతున్నాయంటున్నారు.
పైగా లాక్డౌన్ కారణంగా రోజంతా ఇంట్లో ఉండటం వల్ల ఏసీ, ఫ్యాన్లు, టీవీ వాడకం పెరిగింది. టీ, కాఫీ ఎక్కువసార్లు తాగడం వల్ల అర లీటరు పాల వినియోగం అధికమైంది. 30 రోజులొచ్చే గ్యాస్ సిలిండర్ 24 రోజులకే అయిపోతుంది. శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్వాష్ లిక్విడ్లకు వెయ్యి ఖర్చవుతుందని చెబుతున్నారు.
బంధువుల ఇళ్లకు వెళ్లడం, వాహనాల్లో తిరిగే ఖర్చులు తగ్గినా ఇంటి ఖర్చు కొంత పెరిగిందంటున్నారు. అయిపోయిన వెంటనే దొరకవేమోనన్న కారణంతో వెంటవెంటనే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇంట్లో వంటలు కూడా పెరిగాయి. దీంతో సిలిండర్ల బుకింగ్లు, వాటితో పాటు ఖర్చులూ పెరిగాయి.