Mamta Kulkarni: మహా కుంభమేళా ప్రారంభంలో ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారిన ప్రముఖ టాలీవుడ్ నటి మమతా కులకర్ణి కిన్నెర అఖాడా నుంచి బహిష్కరణకు గురయ్యారు. మహామండలేశ్వర్ గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. పలువురు మతపెద్దలు, అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆమెను అఖాడాలో చేర్చుకున్న కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కూడా అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.
కిన్నెర అఖాడాలో కులకర్ణి చేరిన తర్వాత అందులోని సభ్యుల మధ్య వివాదాలు చెలరేగాయి. అఖాడాలో చేరిన మొదట్లోనే ఆమె అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను పొందడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. మహాకుంభమేళా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని కానీ కొందరు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రముఖ యోగా గురువు బాబా రామ్ దేవ్ మండపడ్డారు.
ఇప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి..మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారని ఆగ్రహించారు. ఈ క్రమంలోనే అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్, కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు తీవ్ర దశకు చేరుకున్నాయి. అజయ్ దాస్ అఖాడా నుంచి బయటకు వెళ్లి తన కుటుంబంతో నివసిస్తున్నారని..కిన్నెర అఖాడా నియమాల ప్రకారం కుటుంబంతో ఉన్నవారికి ఈ నిర్ణయం తీసుకునే అధికారం లేదని త్రిపాఠి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై బహిష్కరణ వేటు వేసినట్లు సమాచారం.