మోదీ సర్కార్కు సవాల్ విసిరిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బెంగాల్లో పౌరసత్వ సవరణ అమలు చేయమని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బెంగాల్లో పౌరసత్వ సవరణ అమలు చేయమని తెలిపారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారీ నిరసన ప్రదర్శనలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. తమ రాష్ట్రంలో పౌర చట్టాన్ని, ఎన్ఆర్సీలను అమలు చేయమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కేంద్ర ప్రభత్వానికి సవాల్ విసిరారు. తాను ఒంటరి అనుకుంటే పొరపాటని తన వెంట ఎంతో మంది ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు.
మతాల కోసం జరిగే పోరాటం తమ పోరాటం కాదని సరైన మార్గం కోసం జరిగే పోరాటం అని మమతా బెనర్జీ అన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ జగ్దీప్ ధంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ మార్చ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోద ముద్రతో పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందిచారని,దానిని సీఎం వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టడం సరైంది కాదన్నారు. రెచ్చ గొట్టే చర్య అంటూ గవర్నర్ జగ్దీప్ ధంకర్ వ్యాఖ్యానించారు.
లోక్సభలో పౌరసత్వ (సవరణ) బిల్లుకు గత సోమవారం అర్థరాత్రి ఆమోదం లభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బిల్లు ద్వారా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్లో వివక్షకు గురై.. అక్కడి నుండి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఇందులో భాగంగానే 2014 డిసెంబరు 31వ తేదీలోపు మూడు దేశాలనుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులను అక్రమ వలసదారులుగా పరిగణించరని ప్రభుత్వం తెలిపింది.
ఈ చట్టం అమలు కావడం వలన చాలా మంది భారతీయులకు అన్యాయం జరుగుతుందని ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. దీంతో దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇదే కోణంలో ఆదివారం ఢిల్లోలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రస్ధాయిలో నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.