Mahatma Gandhi: మహాత్మాగాంధీ ముని మనవరాలికి 7 ఏళ్లు జైలు శిక్ష

Mahatma Gandhi: ఓ ఫోర్జరీ కేసులో గాంధీ ముదిమనవరాలు ఆశిష్ రామ్ గోబిన్ కు డర్బన్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.

Update: 2021-06-08 06:36 GMT

Mahatma Gandhi, Ashish Ram Gobin: (File Image)

Mahatma Gandhi: సౌతాఫ్రికాలోలో ఉండే 56 ఏళ్ల మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ రామ్ గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఓ ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల మధ్య ఆమెను దోషిగా తేల్చుతూ... డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆమె దోషిత్వాన్ని, శిక్షను అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. ఆశిష్ లతా మహారాజ్ ప్రముఖ హక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె.

పూర్తి వివరాల్లో వెళితే... నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ(ఎన్‌పీఏ) ప్రకారం... వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్‌ను ఆశిష్ లతా మోసం చేశారు. న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్‌ డైరెక్టర్ అయిన మహారాజ్‌ను ఆమె అగస్టు,2015లో కలిశారు. మహారాజ్ కంపెనీ ఫుట్‌వేర్‌తో పాటు దుస్తులు కూడా తయారుచేస్తుంది. ఇందుకు అవసరమైన ముడి సరుకును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే ఇతర కంపెనీలకు లాభాల వాటా ప్రాతిపదికన ఆర్థిక సాయం కూడా చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆశిష్ లతా రామ్‌గోబిన్ మహారాజ్‌ను ఆశ్రయించి తనకు రూ.3 కోట్లు పైచిలుకు డబ్బు అవసరం ఉందని చెప్పారు. సౌతాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్‌కేర్‌తో తన కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందని... ఇండియా నుంచి ఆ కంపెనీ కోసం మూడు కంటైనర్ల ముడి సరుకును దిగుమతి చేయిస్తున్నానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందునా దిగుమతి సుంకం,ఖర్చులు భరించలేకపోతున్నానని చెప్పారు. తనకు ఆర్థిక సాయం చేస్తే లాభాల్లో వాటా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు వ్యాపారవేత్త మహారాజ్ ఆమె కోరిన మొత్తాన్ని అందజేశారు.

ప్రముఖ హక్కుల పోరాట యోధురాలు ఎలా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కూతురే ఆశిష్ లతా రాంగోబిన్. ఈ కేసు విచారణ 2015లోనే ప్రారంభమైంది. ఆమె మోసపూరిత చర్యలో భాగంగా... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు సృష్టించారని తెలిసింది. మూడు కంటైనర్లు ఇండియా నుంచి షిప్పులో వస్తున్నట్లు ఆమె తెలిపారని తెలిసింది.

ఆ తర్వాత కొద్దిరోజులకే ఎస్ఆర్ మహారాజ్‌కు అసలు విషయం తెలిసింది. అసలు నెట్‌కేర్ గ్రూపు ఆశిష్ లతాతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిసింది. తప్పుడు ధ్రువ పత్రాలతో ఆమె తనను మోసం చేసినట్లు గుర్తించారు. నెట్‌కేర్ పేరిట నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి తనను బురిడీ కొట్టించినట్లు గుర్తించారు. అంతేకాదు,అసలు ఇండియా నుంచి ఆమె ఎటువంటి గూడ్స్ దిగుమతి చేయలేదని తేలింది. దీంతో ఆశిష్ లతాపై మహారాజ్ డర్బన్ కోర్టును ఆశ్రయించడంతో మోసం,ఫోర్జరీ ఆరోపణల కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా డర్బన్ కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్షను ఖరారు చేసింది.

Tags:    

Similar News