Indian Space Research Organization: ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్దం..

Indian Space Research Organization: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విశ్వ శోధనలపై మరోసారి దృష్టి పెట్టింది.

Update: 2020-11-01 12:39 GMT

Indian Space Research Organization | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విశ్వ శోధనలపై మరోసారి దృష్టి పెట్టింది. కరోనా మహమ్మారి ప్రభావంతో తొమ్మిది నెలలుగా ప్రయోగాలకు దూరంగా ఉన్నా ఇస్రో తమ అస్త్రాలకు పదును పెడుతోంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వరుస ప్రయోగాలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు వాయిదా పడ్డ ప్రయోగాలను తిరిగి ఉపయోగించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కరోనా అనంతరం ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో రెడీ అయ్యింది. ఈనెల 7న పీఎస్సెల్వి సీ-49 ప్రయోగానికి సర్వం సిద్దం చేస్తోంది. ఒక స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలతో రోదసీలోకి పంపనుంది.

ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. కొవిడ్‌-19తో ఈ ఏడాది ఆగిపోయిన ఇస్రో అంతరిక్ష ప్రయోగాలను నవంబరు 7న తిరిగి ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో కి అచ్చొచ్చిన వాహక నౌక పీఎస్సెల్వి ద్వారా ఈ ఏడాది తొలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం ప్రథమ ప్రయోగ వేదిక నుంచి 51వ పీఎస్సెల్వి రాకెట్‌ ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.

ఈ నెల 7న మధ్యాహ్నం 3:02 గంటలకు ప్రయోగించనున్న ఈవాహక నౌకద్వారా మన దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం, ఎక్స్‌ అబ్జర్వేషన్‌ శాట్‌లైట్‌-1లతో పాటు మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసిలోకి పంపనుంది. గతేడాది 5 న పిఎస్ఎల్వి.. చంద్రయాన్- 2 లో భాగంగా ఒక జిఎస్ఎల్వి మార్క్‌-3 రాకెట్‌లను ప్రయోగించిన ఇస్రో 2020లో 15 రాకెట్‌ ప్రయోగాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొవిడ్‌-19 ఇస్రో ప్రయోగాలకు కళ్లెం వేసింది. దాంతో స్వదేశం నుంచి ఒక్క రాకెట్‌ను కూడా ఇస్రో ప్రయోగించలేకపోయింది.

జనవరి 17న ప్రెంచ్‌ గయానా నుంచి జీ శాట్‌ 30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టించుకున్న ఇస్రో తదుపరి మార్చి 5న షార్‌ నుంచి పీఎస్సెల్వి ఎఫ్‌-10 రాకెట్‌ ద్వార జీ శాట్‌-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. కానీ ప్రయోగానికి గంట ముందు కేంద్ర నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో అర్ధంతరంగా ప్రయోగాన్ని నిలిపివేశారు. తదుపరి కరోనా విజృంభించడంతో ఇస్రో అంతరిక్ష పరిశోధన కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఈ ఏడాది తొలి రాకెట్‌గా పీఎస్సెల్వి సీ-49ని ప్రయోగించేందుకు షార్‌లో చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Tags:    

Similar News