Kejriwal: భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఓ దుర్దినం

Kejriwal: రాజ్యసభలోనూ జీఎన్సీటీడీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందడం భారత ప్రజాస్వామ్యంలో దుర్దినం అని ఢిల్లీ సీఎం అన్నారు

Update: 2021-03-25 04:05 GMT

కేజ్రీవాల్ :(ఫైల్ ఇమేజ్) 

Kejriwal: ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇది వరకే లోక్‌సభలో ఆమోదం పొందగా.. తాజాగా రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. ఈ బిల్లు ప్రకారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేటికైనా ఎల్జీ ఆమోదం తప్పనిసరి కానుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్రం ప్రభుత్వం టార్గెట్ గా మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఓ దుర్దినమని అన్నారు. ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వం వద్ద మరింత అధికారం ఉండేలా చూసేందుకు, అధికారంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు తనవంతు పోరాటం చేస్తానని అన్నారు. "రాజ్యసభలోనూ జీఎన్సీటీడీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. భారత ప్రజాస్వామ్యంలో దుర్దినం. మేము మరింతగా కష్టపడాలి. ప్రజలకు అధికారాన్ని తిరిగి అప్పగించేందుకు శ్రమిస్తాం. ఆ దిశగా ఎన్ని అడ్డంకులుఎదురైనా మంచి చేసేందుకే మేము ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో ఆగబోము, నిదానించము" అని ట్వీట్ చేశారు.

ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా భారత చరిత్రలో చీకటి రోజని అభివర్ణించారు. "ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కులు హరించుకుపోతున్నాయి. ఢిల్లీని తీసుకుని వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతున్నారు. ఇంత దుర్మార్గమా? ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు పార్లమెంట్ ను వినియోగించుకుంటున్నారు. ఈ నియంతృత్వ ధోరణిపై ఢిల్లీ వాసులు పోరాటం సాగిస్తారు" అని సిసోడియా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే.. ఇవాళ భారత రాజ్యాంగానికి జరిగిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ విమర్శించారు. రెండు కోట్ల మంది ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పేంటని ప్రశ్నించారు. స్కూళ్లు తెరవడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం, మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటుచేయడమే తాము చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కాగా, పలు విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ, రాజ్యసభలో ఈ బిల్లుకు నిన్న ఆమోదం పడిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీలన్నీ వాకౌట్ చేసిన తరువాత బిల్లును ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.

Tags:    

Similar News