సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జియో ప్రకటించడంపై సినీ ప్రరిశ్రమలో మిశ్రమ స్పందన వస్తుంది. నిర్మాతలకు ఇది గుడ్ న్యూస్ అంటుండగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబీటర్లకు కష్టకాలం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రిలయన్స్ 42 వ వార్షికోత్సవ సందర్భంగా జియో సేవలను మరింత విస్తృతం చేస్తూ అంబానీ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా.. బ్రాడ్ బాండ్ సేవలపై భారీ ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది నుంచి సినిమా విడుదలైన రోజే ఇంట్లో హాయిగా కూర్చొని చూడొచ్చంటూ తెలిపారు. ఈ ప్రకటనపై సినీ పరిశ్రమలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయంతో ప్రొడ్యూసర్లకు ఎలాంటి నష్టం ఉండదని చిన్న నిర్మాతలకు ఎలాంటి ఢోకా ఉండదంటున్నారు.
అయితే జియో నిర్ణయం సినీ పరిశ్రమలోని ఇతర రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ డే టీవీల్లో సినిమా చూసే అవకాశం వస్తే ప్రేక్షకులు థియేటర్కు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వ్యవస్థలకు పెద్ద ఎదురుదెబ్బే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటివి ఇప్పటికే సినిమాలను ప్రేక్షకుల చేతుల్లోకి తీసుకొచ్చాయి. అయితే సినిమా విడుదలైన 10 వారాలకు వాటిలో సినిమా చూడోచ్చు. మరిప్పుడు తొలిరోజునే సెట్ అప్ బాక్స్ ద్వారా సినిమా చూసే అవకాశం వస్తే ఆయా సంస్థలకు కూడా జియో సవాలు విసిరినట్లే అని చెబుతున్నారు.