ఫిఫ్టీ-ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్ : అసదుద్దీన్ ఓవైసీ
మహారాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే తపన బీజేపీ, శివసేనలకు లేదని, భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అయినా రెండు పార్టీలు ఫిఫ్టీ-ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయన్నారు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల చర్చలు ఓ కొలిక్కి రాలేదు. 15 రోజులుగా ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతునే ఉంది. బీజేపీ, శివసేన తీరును ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఫిఫ్టీ-ఫిఫ్టీ పేరుతో మార్కెట్లోకి కొత్త బిస్కట్ వచ్చిందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే తపన బీజేపీ, శివసేనలకు లేదని, భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అయినా రెండు పార్టీలు ఫిఫ్టీ-ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయన్నారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం రెండు స్ధానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లేదా మరొకరు సీఎం అవుతారో తెలియదు కానీ, మ్యూజికల్ ఛైర్ కొనసాగుతోందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన బీజేపీ అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. తమ పార్టీకి 170 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని తెలిపారు. సంజయ్ రౌత్ పెల్చిన బాంబు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.