ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పగడ్బందీ ఏర్పాట్లు!

Independence Day 2020 celebrations: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2020-08-13 03:13 GMT
Independence day at Red fort (file image)

కరోనా విజృంభణతో ప్రస్తుతం దేశంలో ఏ వేడుకలు జరిగే పరిస్థితి లేదు. అయితే ఏది ఎలా ఉన్నా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించడం మాత్రం తప్పనిసరి. ఈ నేపథ్యంలో అధికారులు వేడుక నిర్వహణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రోజు విధులు నిర్వహించే భద్రతా అధికారులు ఆగస్టు 15 ఉదయం వరకు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అంతేకాక జెండా ఎగరవేసే సమయంలో ప్రధానికి సమీపంగా ఉండే వారికి కరోనా టెస్టులు చేయిస్తున్నారు అధికారులు. ఆగస్టు 15న ఎర్రకోటలో జెండా ఎగురవేసే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సమీపంగా ఓ మహిళా సైనిక అధికారి ఉండనున్నారు. సదరు అధికారిణి జెండా తాడును మోదీకి అందిస్తారు. ఆ తర్వాత ప్రధాని జెండాను ఎగువేస్తారు. ఈ క్రమంలో తాడు ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మహిళా అధికారికి కోవిడ్‌-19 పరీక్ష చేయించారు అధికారులు.

ఆగస్టు 15 వేడుకల్లో విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది అందరికి కరోనా టెస్టులు చేయించారు అధికారులు. ఎర్రకోటలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొందరు వీవీఐపీ ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారు. దాంతో వారి క్షేమం దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారిలో భారత సైన్యం, వైమానిక దళం, నావికా దళం, ఢిల్లీ పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్లు, ఆపరేటర్లు, కుక్‌, ట్రైనర్స్‌, ఇతర సిబ్బంది కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. 

కార్యక్రమం ఇలా..

దేశంలో క‌రోనా ఉధృతి పెరుగుతున్న నేప‌థ్యంలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని చాలా సాధార‌ణంగా నిర్వ‌హించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్రధాని షెడ్యూల్ ని అధికారులు విడుదల చేశారు. శనివారం ఉదయం7:21 నిమిషాలకు ప్రధాని ఎర్రకోటకు చేరుకుంటారు. సరిగ్గా 7:30 నిమిషాలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.అనంత‌రం దేశప్రజలనుద్దేశించి .. సుమారు 40 నుంచి 90 నిమిషాల పాటు ఆయ‌న ప్రసంగిస్తారని సమాచారం. మాములు రోజుల్లో అయితే... త్రివిధ దళాలకు చెందిన జవాన్లు భారీ సంఖ్యలో గౌరవ వందనం ఇస్తారు. ఈసారి మాత్రం కేవలం 22 మంది జవాన్లతోనే గౌరవ వందన కార్యక్రమం ఉంటుంది.


Tags:    

Similar News