Idli-sambar: పర్యాటకుల సంఖ్య తగ్గడానికి బీచ్ లలో ఇడ్లీ-సాంబార్ అమ్మకాలు కారణం.. ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్
Goa: గోవాలో కొంతకాలంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంపై స్థానిక ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి బీచ్ లో ఇడ్లీ సాంబార్, వడా పావ్ లు విక్రయించడం వల్లే విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందన్నారు. నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరు నుంచి వచ్చిన వారు బీచ్ దుకాణాల్లో వడా పావ్ లు అమ్ముతున్నారు. మరికొందరు ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. అందుకే గత రెండు ఏళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయిందన్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మైఖేల్ లోబో పేర్కొన్నారు. అయితే పర్యాటకంపై ఇడ్లీ సాంబార్ విక్రయాలు ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించినప్పటికీ కారణాలెన్నో ఉన్నాయని చెప్పారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్, రష్యా పర్యాటకులు కూడా గోవాకు రావడం మానేశారన్నారు.
గోవాలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని..అందరూ దీనికి బాధ్యులేనని ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ దుకాణాలను అద్దెకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గడంపై కారణాలను అన్వేషించేందుకు టూరిజం శాఖతో సహా భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భేటీ అయి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక టాక్సీలు, క్యాబ్ ల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని..ఈ పరిస్థితులను సరిదిద్దుకుంటే పర్యాటకానికి చీకటి రోజులేనని హెచ్చరించారు.