SBI పిటిషన్.. ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
Supreme Court: ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశం
Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్తో పాటు.. మరో పిటిషన్ను కూడా రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగానికి విరుద్ధమని వెల్లడించింది. బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలంటూ ఎస్బీఐని ఆదేశించింది. బాండ్ల ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. ఆ సమాచారాన్ని.. పబ్లిక్ డొమైన్ ద్వారా ఈ నెల 13లోగా బహిరంగపరచాలని ఈసీకి స్పష్టంచేసింది.
అయితే తక్కువ గడువులో బాండ్ల సమాచారం ఈసీకి సమర్పించడం కష్టమని.. గడువును పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో ఎస్బీఐ పిటిషన్ వేసింది. ఇదిలా ఉంటే సమాచారాన్ని ఈసీకి అందించకపోవడం ద్వారా ఎస్బీఐ.. సర్వోన్నత న్యాయస్థాన తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందంటూ మరో పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రెండు పిటిషన్లను విచారించనుంది.