నెలరోజులకుపైగా కొనసాగుతోన్న మహా డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చేనట్లే కనిపిస్తున్నాయి. సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమైనట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి ప్రణాళిక, అధికార పంపిణీపై మూడు పార్టీలూ ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా, శివసేన-ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా అలాగే, కాంగ్రెస్కు ఐదేళ్లపాటు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
పదవుల పంపకం ఉమ్మడి ప్రణాళికతోపాటు లౌకిక స్ఫూర్తికి కట్టుబడాలన్న ప్రతిపాదనలపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ దాదాపు అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే, మొదటి టర్మ్లో శివసేన నుంచి ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి చేపడతారని, అలాగే కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలుగా ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంటున్నారు. మంత్రి పదవులు పంపకంపైనా కసరత్తు జరుగుతోంది.