దేశంలో ఒకవైపు కరోనా విస్తరణ ఆందోళన కలిగిస్తుంది. అయితే, వైరస్ కేసులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం ఊరటనిస్తోంది. వైరస్ వ్యాప్తిని చిన్న రాష్ట్రాలు సమర్థవంతంగా అడ్టుకుంటున్నాయి. దేశంలో తొలి కరోనా రహిత రాష్ట్రంగా గోవా నిలిచింది.
దేశంలో కరోనా కట్టడి విషయంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆ కేసులు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో పలు రాష్ట్రాలు మంచి పురోగతి సాధిస్తున్నాయి.
దేశంలోని 736 జిల్లాల్లో ఏప్రిల్19 నాటికి 325 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఏప్రిల్4 నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాని గోవా దేశంలోని తొలి కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో నమోదైంది కేవలం ఏడు పాజిటివ్ కేసులే. వారందరూ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మణిపూర్ కూడా కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది.
కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో తొలి నుంచీ సమర్థంగా వ్యవహరిస్తున్న కేరళలో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమవుతోంది. ఆ రాష్ట్రంలో 402 మంది వైరస్ బారిన పడగా 270 మంది కోలుకున్నారు. ముగ్గురు మాత్రమే మరణించారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా ఆ రాష్ట్రంలో ఇంకా 46 వేల మందిపై నిఘా పెట్టారు. సిక్కింలో ఇంతవరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ రాష్ట్రానికి సరిహద్దుల్లో చైనా, నేపాల్, భూటాన్ దేశాలు ఉండడంతో ముందే అప్రమత్తమై జనవరి 29 నుంచే స్ర్కీనింగ్ అమలు చేశారు.
దేశవ్యాప్తంగా 411 జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాల్లో కూడా 100 కంటే ఎక్కువ కేసులు నమోదైంది కేవలం 18 జిల్లాల్లోనే. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క ముంబైలోనివే. అలాగే, మధ్యప్రదేశ్లో సగానికిపైగా కేసులు ఇండోర్లో, తెలంగాణలో నమోదైన కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్లో నమోదయ్యాయి.