సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం అక్కడక్కడా హింసాత్మకంగా ముగిసింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో పోలింగ్ కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు రెండు గ్రనేడ్లు విసరగా, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు తన్నుకున్నారు. 7 రాష్ట్రాల్లోని 51 స్ధానాలకు ఐదో దశలో పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎండను లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఇక బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 62.46 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో 57.76 , జమ్మూకశ్మీర్లో 17.07, జార్ఖండ్లో 64.60, మధ్యప్రదేశ్లో 64.61, రాజస్థాన్లో 63.69, ఉత్తరప్రదేశ్లో57.06, బెంగాల్లో 74. 42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.