కేరళలో ఆలయ వేడుకల్లో ఏనుగుల ఫైట్... వీడియో వైరల్!
Kerala: త్రిస్సూర్లోని థారక్కల్ ఆలయంలో ఘటన
Kerala: కేరళ రాష్ట్రం త్రిస్సూర్ లోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తుండగా ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కింద పడేసి, మరో ఏనుగుపై దాడికి ప్రయత్నించింది. దీంతో వేడుకలను చూసేందుకు వచ్చిన జనం భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ క్రమంలో పలువురు గాయపడ్డారు. త్రిస్సూర్ జిల్లా అరట్టుపుజ గ్రామంలోని థారక్కల్ ఆలయంలో ఘటన చోటు చేసుకుంది.
ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు అకస్మాత్తుగా మరో ఏనుగుపై దాడి చేసింది. దీంతో ఆ ఏనుగు పరుగందుకుంది. దాదాపు కిలోమీటర్ దూరం పరిగెత్తింది. నియంత్రించేందుకు ప్రయత్నించిన మావటి శ్రీకుమార్ పైనా ఏనుగు దాడి చేసింది. పైనుంచి కిందపడేయడంతో గాయపడ్డ శ్రీకుమార్ను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలో చాలామంది కిందపడి గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.