BJP: మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక మరింత ఆలస్యం?
BJP: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి అడుగులేస్తోన్న కేంద్ర నాయకత్వం
BJP: మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక మరింత ఆలస్యం?
BJP: మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఫలితాలొచ్చి వారం అయినా సీఎంల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది బీజేపీ అధిష్టానం. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే విజయం సాధించింది బీజేపీ. అయితే మధ్యప్రదేశ్లో ఇప్పటికే చౌహాన్ సీఎంగా ఉండగా.. కొత్త నేతను సీఎం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఎవరు సీఎంగా ఉండాలనే అంశంపై ఇప్పటికే అబ్జర్వర్లను నియమించిన హై కమాండ్.. వారి ఆధ్వర్యంలో ఇవాళ రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు మధ్యప్రదేశ్లో బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల మెజారిటీ ఎవరికి ఉంటే వారిని సీఎంగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక త్వరలోనే లోక్సభ ఎన్నికలు ఉండటంతో సీఎంల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది బీజేపీ. హ్యాట్రిక్ కొట్టి మరోసారి మోడీని ప్రధాని చేయాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ నుంచి మెజారిటీ ఎంపీ సీట్లను ఆశిస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్తాన్ నుంచి తమకు మెజారిటీ ఎంపీలు ఉండగా.. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఆ రాష్ట్రంలో కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు చేస్తోంది కమలం పార్టీ. దీంతో ఎక్కడా అసంతృప్త జ్వాలలు చెలరేగకుండా జాగ్రత్తలు పడుతోంది బీజేపీ. అధిష్టానం నిర్ణయించే సీఎంను కాకుండా ఎమ్మెల్యేలు బలపరిచిన సీఎంను కుర్చీలో కూర్చోబెట్టేలా ఆచితూచి అడుగులేస్తోంది.