Barmer District: కరోనాతో మరణించిన తండ్రి చితిలో దూకిన కుమార్తె

Coronavirus: కరోనా తో కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకేసిన కుమార్తె.

Update: 2021-05-05 06:39 GMT

కొరోనా వైరస్ 

Barmer District: కరోనా సెకండ్ వేవ్ తో దేశం అతలాకుతలం అవుతోంది. చాలా మంది కరోనా మహమ్మారి బారిన పడుతుండగా, మరి కొంత మంది మహమ్మారికి బలౌతున్నారు. కొన్ని సందర్భాల్లో కడచూపు కూడా కరువౌతోంది. ఇలాంటి సందర్భాల్లో మానసికంగా చాలా ధృఢంగా వుంటే తప్ప ఇలాంటి అవరోధాలను ఎదుర్కోలేము. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతి, ఇప్పుడు తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఇండియా - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడ నివాసం ఉంటున్న దామోదర్ దాస్ కరోనా సోకి మరణించాడు. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన స్థానిక పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో చితికి నిప్పంటించారు. ఆ వెంటనే, దామోదర్ దాస్ కుమార్తె శారద చితిపైకి ఉరికింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన బంధుమిత్రులు, ఆమెను బయటకు తీసేలోగానే 70 శాతం కాలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు, వివరాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి, ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేదని, అందువల్ల ఇంకా స్టేట్ మెంట్ ను నమోదు చేయలేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జోధ్ పూర్ ఆసుపత్రికి తరలించామని అన్నారు.

Tags:    

Similar News