కరోనా మృతులు ఏ మతం వారైనా.. అంత్యక్రియలు ఆ పద్ధతిలోనే..
దేశంలో గంటగంటకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో గంటగంటకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 30 మంది మరణించి తెలంగాణలోనూ ఆరుగురు బలయ్యారు. మహారాష్ట్ర , కర్ణాటకలలో 200 పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర లో 10మంది మరణించారు. కరోనా వైరస్ మానవ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. కరోనా మృతుల అంత్యక్రియలకు భయపడి ఇప్పటికే బంధవులు రాలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల మృతదేహాలను మున్సిపాల్ సిబ్బంది ఖననం చేస్తున్నారు. దీంతో కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా బారిన పడి చనిపోయిన వారు ఏ మతానికి సంబంధించిన వారైనా.. దహనం చేస్తారని బిఎంసి చీఫ్ ప్రవీణ్ పర్దేసి వెల్లడించారు. చనిపోయిన వారి అంత్యక్రియల్లో ఐదుగురికి కంటే ఎక్కువ మంది హాజరు కావొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మృతదేహాలను దహనం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మృతదేహాల ఖననం విషయంలో మంగళవారం కేంద్రం మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
కరోనా వలన మరణించిన వ్యక్తి డెడ్ బాడీని లీక్ ప్రూఫ్ ప్లాస్టిక్ జిప్ బ్యాగ్లో ఉంచాలని తెలిపింది. ఆ బ్యాగ్ పై భాగంలో హైపోక్లొరైట్ ద్రావణాన్ని చల్లాలి. ఆ బ్యాగ్ను మళ్లీ మార్చురీ షీట్తో చుట్టాలని పేర్కొంది. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన తర్వాత వైద్య సిబ్బంది కూడా ధరించిన పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్ మెంట్ అంతా డిస్పోజ్ చేయాలని కేంద్ర మార్గదర్శకాల్లో సూచించింది.
మృతదేహాన్ని నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న కోల్డ్ చాంబర్లో ఉంచాలి. అక్కడ్నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లాక హైపోక్లొరైట్తో ఆ చుట్టుపక్కల శుభ్రంగా కడగాలి. మృతదేహాలు కుళ్లిపోకుండా ఉండేందుకు ఎలాంటి విధనాలు పాటించవద్దని కేంద్రం స్పష్టం చేసింది.