Coronavirus: కబళిస్తున్న కోవిడ్ 19.. 5 వేలు దాటిన మరణాల సంఖ్య
భారత్లో కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా విస్తరిస్తోంది.
భారత్లో కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా విస్తరిస్తోంది. ఈ కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా 5052 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సోకి 1,34,496 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా మరో 6 కరోనా కేసులు నమోదవ్వడంతో దేశంలో అధికారికంగా కరోనా కేసులు 81కి చేరింది. దేశంలో తొలి మరణం గురువారం రాత్రి కర్ణాటకలో చోటు చేసుకోవడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారం రోజుల షాపింగ్ మాల్స్, పాఠశాలలను మూసివేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు జనసందోహాలకు ప్రజలు దూరంగా ఉండాలంటూ పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. కేరళ, మధ్యప్రదేశ్, హరియాణా, జమ్మూ, శ్రీనగర్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
ఇక కెన్యాలో తొలి కరోనా కేసు నమోదైంది. మార్చి 12న 27 ఏళ్ల కెన్యా మహిళకు నైరోబిలో కరోనా పాజిటివ్గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. అమెరికా నుంచి లండన్ మీదుగా ఆ మహిళ కెన్యాకు వచ్చినట్టు తెలిపారు. ఇరాన్లో కరోనా మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 85మంది మరణిచారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 514కు చేరింది. 11,364 మంది ఈ వైరస్తో చికిత్స పొందుతున్నారు.