కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కర్నాటక సంక్షోభంతో పీకలలోతు కష్టాలు చిక్కుకుంటే, ఇప్పుడు గోవా కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. కాంగ్రెస్ కున్న 15 మంది ఎమ్మెల్యేలలో పది మంది ఎమ్మెల్యేలు సీఎల్పీని బీజేపీలో విలీనం చేయాలని స్పీకర్ కు లేఖ అందజేశారు. మొన్న తెలంగాణ. నేడు కర్ణాటక ఇలా కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా గోవా వంతు వచ్చింది. తెలంగాణలో తరహాలో సీఎల్పీ విలీనం సీన్ గోవాలో రిపీట్ అవుతోంది.
గోవాలో కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చీలిక వర్గంగా ఏర్పడి అధికార బీజేపీలో శాసనసభాపక్షం విలీనం చేయాలని కోరుతూ స్పీకర్కు లేఖ సమర్పించారు. ప్రతిపక్ష నేత చంద్రకాంత్ కవలేఖర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం స్పీకర్ను కలిసింది. గోవాలో మొత్తం అసెంబ్లీ సీట్లు 40 కాగా మిత్రపక్షాలను మినహాయిస్తే బీజేపీకి 17 కాంగ్రెస్ కు 15 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు పది మంది బీజేపీ పక్షాన చేరడంతో బీజేపీ బలం 27కు చేరుకోగా, కాంగ్రెస్ కు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.