Indian Navy: సముద్రపు దొంగల భరతం పడుతున్న భారత నేవీ
Indian Navy: అరేబియా సముద్రంలో పైరేట్ల ఆటకట్టిస్తున్న ఇండియన్ నేవీ
Indian Navy: అరేబియా సముద్రంలో పైరేట్స్ దాడులకు ఇండియన్ నేవీ సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తోంది. సముద్రంలో నిరంతర గస్తీతో సముద్రపు దొంగలను తరిమికొడుతోంది. ఇటీవలే వివిధ దేశాలకు చెందిన నావికుల్ని రక్షించిన నేవీ.. తాజాగా మరో డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్థానీ నావికుల్ని రక్షించింది. సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయీమీ ఫిషింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు.
19 మంది పాకిస్థానీ నావికుల్ని బంధించారు. సమాచారం అందుకున్న భారత్ యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రను రంగంలోకి దింపింది. ఓడను అడ్డగించి, బందీలను విడిపించింది. ఈ ఆపరేషన్ కు రెండ్రోజుల ముందే భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ ను సోమాలియా దొంగలు అపహరించారు. ఐఎన్ ఎస్ సుమిత్ర, అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ రంగంలోకి దిగి.. చిక్కుకున్న 17 మంది మత్స్యకారులను రక్షించింది.