ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఈరోజు, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలవనున్న వైఎస్ జగన్.... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన అంశాలపై మెమొరాండం ఇవ్వనున్నారు. ముఖ్యంగా పోలవరం టెండర్ల రద్దు, పీపీఏల సమీక్ష, ప్రత్యేక హోదాపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించనున్న వైఎస్ జగన్... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు.
పోలవరం టెండర్ల రద్దు, పీపీఏల సమీక్షపై మోడీకి జగన్ వివరించనున్నారు. ఇక ప్రత్యేక హోదాపైనా మోడీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.అయితే, వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇష్యూ... గతించిన అంశమన్న జీవీఎల్.... తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రధాని మోడీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారంటూ చెప్పుకొచ్చారు.