కాలితో సెల్ఫీ...
చాలా మంది వికలాంగులు తమకు అంగవైకల్యం ఉందని మేం ఏం సాధించలేమని వారిలో వారే బాధపడుతుంటారు.
చాలా మంది వికలాంగులు తమకు అంగవైకల్యం ఉందని మేం ఏం సాధించలేమని వారిలో వారే బాధపడుతుంటారు. కానీ ఇంకొంత మంది మాత్రం మాకు కాళ్లూ, చేతులూ లేకపోతేనేం మేం దేన్నైనా సాధిస్తాం అన్న పట్టుదలతో అనుకున్న పనిని సాధిస్తారు. ఉదాహరణకు సుధాచంద్రన్, రవీంద్ర జైన్, గిరీష్ శర్మ, శేకర్ నాయక్, హెచ్ రామకృష్ణన్, ప్రీతి శ్రీనివాసన్, సత్యేంద్ర సింగ్, హెచ్. బోనిఫేస్ ప్రభు, సాయి ప్రసాద్ విశ్వనాథన్, అక్బర్ ఖాన్, అరుణిమా సిన్హా, జావేద్ అబిది వీరంతా అంగవైకల్యం కలిగిఉన్నప్పటికీ వాళ్లు అనుకున్నది సాధించారు. ప్రపంచంలోనే వారికంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. అదే కోణంలో కేరళకు చెందిన ఒక యువకుడు కూడా అంగవైకల్యం ఉండి కూడా తన సంపాదనతో ఎంతో మందికి సాయం చేస్తున్నాడు.
వివరాల్లోకెళితే కేరళకు చెందిన ఆ దివ్యాంగ యువకుడి పేరు ప్రణవ్ ఎంబీ. ఇతని వయస్సు 22 సంవత్సరాలు. ఇతను పుట్టుకతోనే తనకు రెండు చేతులూ లేవు. అయినప్పటికీ ఈ యువకుడు తనకి వైకల్యం ఉందన్న విషయాన్ని మర్చిపోయి ఒక గొప్ప చిత్రకారుడుగా తయారయ్యాడు. తాను అనుకున్న దానిని సాధించాడు. పలక్కాడ్ జిల్లాలోని చిత్తూర్ ప్రభుత్వ కాలేజీలో ప్రణవ్ బీకామ్ పూర్తి చేసి ఉన్నత చదువుల చదవాలన్న కోరికతో కోచింగ్ కూడా తీసుకుంటున్నాడు. అతనికి రెండు చేతులూ లేనప్పటికీ తన కాళ్లనే తన చేతులుగా చేసుకుని అద్భుతమైన చిత్రాలను గీసాడు. ఈ చిత్రాలను ప్రదర్శించి ఎన్నో బహుమతులను కూడా పొందాడు. అతని ప్రతి కష్టంలోనూ తన తల్లిదండ్రులు తనకు తోడుగా నిలిచారు. ఆ ఇద్దరే తనకు రెండు చేతులుగా ఉన్నారు.
అయితే ఈ మధ్యే తన పుట్టిన రోజును పురస్కరించుకుని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు సహాయాన్ని అందించారు. ఎంతో కొంతమందికి తన డబ్బులతో చేయూతను ఇచ్చాడు. అంతే కాక తనకు రెండు చేతులు లేనప్పటికీ తన ఓటు హక్కును ఏప్రిల్ 23న జరిగిన లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకున్నాడు. తన కుడి కాలి రెండో వేలుతో ఈవీఎంను నొక్కి ఓటు వేసాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రణవ్ గురించి తన ఫేస్బుక్లో ఈ విధంగా పోస్ట్ చేశారు.
" ఈరోజు నేను కార్యాలయానికి రావడంతోనే నాకు ఒక మంచి అనుభవం ఎదురైంది. రెండు చేతులూ లేని ఒక చిత్రకారుడు నా కార్యాలయానికి వచ్చాడు. ఆ చిత్రకారుడు తన పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతు సాయం అందించడానికి ముందుకొచ్చాడు. తాను టీవీలో ప్రదర్శనలు ఇచ్చి సంపాదించిన డబ్బును చెక్కు రూపంలో విరాళంగా అందించాడు. తను చేసిన అంత మంచి పనిలో తన తల్లదండ్రులు బాలసుబ్రమణియన్, స్వర్ణకుమారితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేడీ ప్రసన్న కూడా పాలుపంచుకున్నారు. ఆ యువకుడు నాతో చాలా సేపు మాట్లాడి తన కాలితో సెల్ఫీ తీసుకున్నాడు. దాంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అని సీఎం విజయన్ చెప్పుకొచ్చాడు.
ప్రణవ్ ఇలా సాయం చేయడం ఇదేం మొదటి సారి కాదు ఇంతకు ముందుకూడా ఇలాంటి సాయం చేశాడు. అంతే కాక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రణవ్ గురించి తన ట్విటర్లో ఫోస్టను చేశారు. తన కాలితో గీసిన చిత్రాలను సచిన్ కు ఇస్తున్న ఫొటోలను కూడా సచిన్ ట్వటర్లో పోస్ట్ చేశాడు.