ఈరోజు ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్ భవనం పనులు

సెంట్రల్‌ విస్టా పనులు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి.

Update: 2021-01-15 05:03 GMT

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ 

సెంట్రల్‌ విస్టా పనులు ఇవాళ ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి మరుసటి రోజున సుముహూర్తంలో నిర్మాణాన్ని ఆరంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. పనులు చేపట్టే ముందు వారసత్వ పరిరక్షణ కమిటీ అనుమతులు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారు. 14 మందితో కూడిన ఈ కమిటీ సోమవారమే అనుమతులు ఇచ్చింది. పనులు చేపట్టనున్న టాటా ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ ఇప్పటికే యంత్రసామగ్రి, ఇతర సరంజామాను సిద్ధం చేసింది.

64 వేల 500 చదరపు మీటర్ల పరిధిలో 971 కోట్లతో కొత్త భవనం రూపుదాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17వేల చదరపు మీటర్లు పెద్దగా ఉండనుంది. ఎలాంటి భూకంపాలకు చెక్కుచెదరని రీతిలో ఈ భవనం నిర్మాణం కానుంది. నూతన భవనం రూపు.. ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్తులు ఉంటాయి. గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ డిజైన్‌ని రూపొందించింది. టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణంలో 2వేల మంది ప్రత్యక్షంగాను.. 9వేల మంది పరోక్షంగాను పాలు పంచుకుంటారు. 200 మందికిపైగా దేశ వ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు ఇందులో పాల్గొంటారు.

ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మాణం కానుంది. స్పీకర్‌‌లు, మంత్రులకు ప్రత్యేక ఆఫీస్‌లు, పార్లమెంట్‌ సభ్యుల కోసం విశాలమైన లాంజ్‌, లైబ్రరీ, మెస్‌లు వంటివి ఏర్పాటు చేస్తారు. 2022 అక్టోబర్‌ నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. పార్లమెంట్‌కు కాస్త దూరంలో ఇప్పుడున్న శ్రమశక్తి భవన్‌ స్థానంలో ఎంపీల కోసం 2024 నాటికల్లా 40 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ప్రత్యేక కార్యాలయాలు నిర్మించి ఇస్తారు. 

Tags:    

Similar News