దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛత్తీస్గడ్, గుజరాత్, తమిళనాడులలో బాధితుల సంఖ్య కలవరం పెడుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ 8 రాష్ట్రాల సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ సీఎస్ పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా అదుపులోనే వుందని తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. ప్రతిరోజూ 200 వందల లోపు కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు 0.43 శాతంగా వుందని సీఎస్ పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్కి వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో 1100 ప్రాంతాల్లో ర్యాపిడ్ ఆంటీజన్ పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా కేసులు నియంత్రిస్తున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు వివరించారు.
రాష్ట్రాలు కరోనా కట్టడికి చేపడుతున్న తమ రక్షణ చర్యలను తగ్గించవద్దని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ సూచించారు. కోవిడ్ ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని, నిబంధనల ఉల్లంఘనల పై గట్టిగా వ్యవహరించాలని కేబినెట్ సెక్రటరీ సూచించారు. వైరస్ సూపర్ స్ప్రెడ్ సంఘటనలకు సంబంధించి సమర్థవంతమైన నిఘాతో పాటు ట్రాకింగ్ వ్యూహాలను అనుసరించాలని రాష్ట్రాలకు సూచించారు. సమర్థవంతమైన నిర్దారణ పరీక్షలు, సమగ్ర ట్రాకింగ్, పాజిటివ్ కేసులను సత్వరమే వేరుచేయడం చేయాలని సూచించారు. పాజిటివ్ వ్యక్తులతో దగ్గరి పరిచయాలు ఉన్న వారిని త్వరితగతిన స్వీయ నిర్బంధం లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సీఎస్లకు సూచించారు.