దేశంలోని విమానాశ్రయాల్లో వచ్చే సంవత్సరం నాటికి భద్రతను మరింత పెంచే దిశగా చర్యలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా దేశంలోని 84 విమానాశ్రయాల్లో మార్చి, 2020 లోపు బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఉన్న డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, సిబ్బంది చేతిలో పట్టుకునే స్కానర్ల స్థానంలో బాడీ స్కానర్లను తీసుకురావాలని దిశానిర్దేశం చేసింది. ''ప్రస్తుతం ఉన్న ఈ రెండు తనీఖీ యంత్రాలు లోహయేతర ఆయుధాలను, పేలుడు పదార్థాలను గుర్తించలేవు. బాడీ స్కానర్లు మాత్రం లోహ, లోహేతర ఆయుధాలను, పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి'' అని పౌర విమానయాన భద్రత సంస్థ (బీసీఏఎస్) ఇటీవల సూచనలు జారీ చేసింది. బాడీ స్కానర్లను వినియోగించే క్రమంలో ఈ 84 విమానాశ్రయాల్లో ప్రామాణిక ఆపరేటింగ్ పద్ధతులు పాటించాలని చెప్పింది.
అయితే, భద్రత దృష్ట్యా దేశంలోని 28 విమానాశ్రయాలను తీవ్ర సున్నిత ఎయిర్పోర్టులుగా గుర్తించారు. మరో 56 విమానాశ్రయాలను సున్నితమైనవిగా గుర్తించారు. మొదట ఈ 84 విమానాశ్రయాల్లో మార్చి 2020లోపు బాడీస్కానర్లను ఏర్పాటు చేయాలని, మిగతా ఆపరేషనల్ ఎయిర్పోర్టుల్లో మార్చి 2021లోపు వీటిని ఏర్పాటు చేయాలని బీసీఏఎస్ సూచించింది. బాడీ స్కానర్ల వల్ల ప్రయాణికుడి పూర్తి శరీర ఆకృతికి సంబంధించిన చిత్రాలు బయటకు వస్తాయన్న ఆందోళన అక్కర్లేదని, ఈ యంత్రాల్లో జనరిక్ మ్యానెక్విన్ను వినియోగిస్తుండడం వల్ల ఇటువంటి చిత్రాలు బయటకు రావని తెలిపారు.