కేంద్ర క్యాబినెట్ లో ఒకే ఒక్క పార్టీ..

ఎల్‌జెపి నాయకుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణం తరువాత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పిఐ) కు చెందిన రామ్‌దాస్ అథవాలే మాత్రమే కేంద్రంలోని..

Update: 2020-10-10 12:42 GMT

ఎల్‌జెపి నాయకుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మరణం తరువాత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పిఐ) కు చెందిన రామ్‌దాస్ అథవాలే మాత్రమే కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో బిజెపి మిత్రపక్షాల నుండి సోలో మంత్రిగా ఉన్నారు. అది కూడా సహాయ మంత్రి హోదా మాత్రమే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో బిజెపి మిత్రపక్షాల నుంచి ప్రాతినిధ్యం లేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత 2019 లో మోడీ 2.0 ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్ర మంత్రివర్గంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి చెందిన అరవింద్ సావంత్ (శివసేన),

హర్సిమ్రత్ కౌర్ బాదల్ (శిరోమణి అకాలీదళ్), రామ్ విలాస్ పాస్వాన్ (లోక్ జనశక్తి పార్టీ) ఉన్నారు. 2019 చివరలో శివసేన ఎన్డీఏ నుంచి వైదొలగగా, వ్యవసాయ బిల్లులపై అకాలీదళ్ ఇటీవల కూటమిని విడిచిపెట్టింది. మరో కీలకమైన ఎన్డీఏ మిత్రపక్షమైన జెడి (యు) మాత్రం అడిగిన శాఖలు ఇవ్వలేదని మంత్రివర్గంలో చేరలేదు. లోక్ జనశక్తి పార్టీ నుంచి ఉన్న రామ్ విలాస్ పాశ్వాన్ అనారోగ్యంతో మరణించారు. దాంతో మిత్రపక్షాల ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

2019 ఎన్నికల్లో ఎన్డీఏ 352 సీట్లు గెలుచుకుంది. ఇందులో ఒక్క బిజెపియే 303 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో గత ఏడాది మే 30న ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 57 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 24 మంది క్యాబినెట్ మంత్రులు, 9 మంది సహాయ మంత్రులు (స్వతంత్ర ఛార్జ్), 24 మంది సహాయ మంత్రులు ఉన్నారు.

2014 లో ఎన్డీఏలో 24 పార్టీలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఎన్‌డిఎ 336 సీట్లు గెలుచుకోగా, బిజెపికి 282 సీట్లు వచ్చాయి. 26 మే 2014 న 24 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర ఛార్జ్), 12 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది క్యాబినెట్ మంత్రులలో హర్సిమ్రత్ కౌర్ (అకాలీదళ్), అనంత్ గీతే (శివసేన), రామ్ విలాస్ పాస్వాన్ (ఎల్జెపి), అశోక్ గజపతి రాజు (టిడిపి) ఉన్నారు.

ఇదిలావుంటే రాజ్యాంగం ప్రకారం, లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో ప్రధానమంత్రితో సహా మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య 15 శాతం మించకూడదు. 543 మంది సభ్యుల లోక్‌సభలో 80 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఉన్నా మోదీ జట్టులో 57 మందికి మాత్రమే అవకాశం కల్పించారు.

Tags:    

Similar News