Army Day 2021: భారత సైనికులకు వందనం!

* నేడు ఇండియన్ ఆర్మీ డే.. * ఈ సంవత్సరం 74వ ఆర్మీ దినోత్సవం * దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ డే సెలబ్రేషన్స్‌ * ఢిల్లీ కరియప్ప గ్రౌండ్‌లో యుద్ధ ట్యాంకుల ప్రదర్శన

Update: 2021-01-15 07:47 GMT

ఆర్మీ డే 2021

భారత దేశంలో జనవరి 15కు ఒక ప్రత్యేకత ఉంది. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది. దేశం కోసం సైనికులు చేస్తోన్న త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను నిర్వహిస్తారు. ఈరోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలు అందజేస్తారు. ఈ సంవత్సరం భారతదేశం 74వ ఆర్మీ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. కవాతులు, సైనిక ప్రదర్శనలతో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ డేను ఘనంగా జరుపుకుంటారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో జరిగే పరేడ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. కరియప్ప గ్రౌండ్‌లో జరిగే ప్రధాన పరేడ్‌లో మిలటరీ హార్డ్‌వేర్, యుద్ధ ట్యాంకులు వంటివి ప్రదర్శించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశానికి చెందిన ఒక కమాండర్‌కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటున్నారు. 1949లో భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కె.ఎమ్.కరియప్ప ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News