రూ 13,500 కోట్ల పీఎన్బీ స్కామ్లో నిందితుడైన మెహుల్ చోక్సీని భారత్కు రప్పించే ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఆయనను భారత్ కు పంపించబోమని ఆంటిగ్వా స్పష్టం చేసింది. అంతేకాదు చోక్సీ ప్రస్తుతం అంటిగ్వా పౌరుడని వెస్టిండీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా చోక్సీని దేశానికి రప్పించేందుకు భారత్ ప్రత్యేక విమానాన్ని కరీబియన్ దీవులకు పంపుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ అధికారి నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మెహుల్ చోక్సీ కోసం భారత్ నుంచి అధికారులు అంటిగ్వా, బార్బుడాలకు వస్తున్నారన్న సమాచారం తమ వద్ద లేదని ప్రధాని కార్యాలయ సిబ్బంది చీఫ్ మాక్స్ హర్ట్ పేర్కొన్నట్టు ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే టీవీ వెల్లడించింది. దీనిపై మాట్లాడిన మాక్స్ హర్ట్ వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు భారత బృందం అంటిగ్వాకు వస్తున్నట్టుగా తాను భావిస్తున్నట్టు చెప్పారు. చోక్సీని తీసుకువెళ్లేందుకు భారత బృందం అంటిగ్వా వస్తుందని తాము అనుకోవడం లేదన్నారు.