తన తల్లీ రెండో పెళ్లి గురించి కేరళకు చెందిన గోకుల్ శ్రీధర్ అనే అబ్బాయి ఫేస్బుక్లో పెట్టిన పోస్టు పలువురిని ఆలోచింపజేస్తుంది.
'నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ. ఆమె వైవాహిక జీవితంలో ఎంతో హింసను భరించింది. భర్త కొట్టే దెబ్బలకు ఒక్కోసారి నుదుటి నుంచి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండేది. అయినా ఆమె ముఖంలో బాధ కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు అని ఎన్నోసార్లు ఆమెను అడిగాను. నీ కోసమే నాన్నా.. నువ్వు బాగుండాలంటే ఇవన్నీ భరించక తప్పదు అన్న ఆమె మాటలు నన్నెంతో అపరాధ భావానికి గురిచేసేవి. ఒకరోజు ఆమెతో కలిసి నేను కూడా నరకం లాంటి ఆ ఇంటిని వదిలి వచ్చేసాను. అవును ఆమె ఎవరో కాదు మా అమ్మ. నా కోసం తన కలలు త్యాగం చేసిన మాతృమూర్తి. మేము ఇళ్లు విడిచిన నాడే ఈ విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అమ్మా.. కొత్త భాగస్వామి సాన్నిహిత్యంలో నీ జీవితం సంతోషంగా గడవాలి. శుభాకాంక్షలు' అంటూ.. గోకుల్ తన తల్లి, ఆమె రెండో భర్త ఫొటోను సగర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు