ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో ఆస్తి వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బుధవారం ఉదయం స్థలం కోసం రెండు వర్గాలు ఘర్షణలకు దిగి పరస్పరం కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. జిల్లా కలెక్టర్ అంకిత్ కుమార్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఉబ్బా గ్రామంలో ఆస్తి కోసం జరిగిన వివాదంలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రెండు వర్గాలకు చెందిన దాదాపు 100 మంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు చెప్పారు. యూపీ, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టామని ఆయన వెల్లడించారు.