అమర్నాథ్ యాత్ర షురూ.. మోసపోయిన 300 మంది భక్తులు
Amarnath Yatra: ఆన్లైన్ ప్యాకేజీ పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న టూర్ ఆపరేటర్లు
అమర్నాథ్ యాత్ర షురూ.. మోసపోయిన 300 మంది భక్తులు
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యింది. జమ్మూకశ్మీర్లోని గందర్బాల్ బల్తాల్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్ బయల్దేరింది. అమర్నాథ్ యాత్రికుల సెక్యూరిటీ కోసం ఈ సారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడంతో పాటు డాగ్ స్క్వాడ్లను కూడా నియమించారు. కాగా, దాదాపుగా 300 మంది భక్తులు ఆన్లైన్ మోసానికి గురయినట్టు తెలుస్తోంది. వీరందరు మోసపోయి జమ్మూలో చిక్కుకున్నారు. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఆన్లైన్ ప్యాకేజీ పేరుతో కొందరు టూర్ ఆపరేటర్లు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి ఈ యాత్రికులను మోసం చేశారు. దీంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్ల పేరుతో ఒక్కో ప్రయాణికుడి నుంచి 7 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు యాత్రికులు జమ్మూ చేరుకొని వారి పత్రాలను తనిఖీ చేయగా... టూర్ ఆపరేటర్లు ఇచ్చిన పత్రాలన్నీ నకిలీవని తేలాయి. దీంతో భక్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ భక్తులందరూ ఆర్ఎఫ్ ఐడీ కార్డు పొందడానికి రిజిస్ట్రేషన్ కేంద్రానికి చేరుకున్నారు. మరోవైపు పుణ్యక్షేత్రం బోర్డు పోర్టల్లో ఈ ప్రయాణికుల డేటా కనబడలేదు. ఆ తర్వాత జమ్మూ అండ్ కతువా అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికారిక వెబ్సైట్లో మాత్రమే యాత్ర కోసం నమోదు చేసుకోవాలని భక్తులకు పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు అమర్నాథ్ యాత్ర పేరుతో భక్తులను మోసం చేసిన ట్రావెల్ ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం చెబుతోంది.