ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఖుష్బూ సపోర్ట్..కొంతమంది మారరు అంటూ ట్వీట్!
ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ మీరా చోప్రా సిటీ పోలీసులతో పాటు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ అభిమానులపై హీరోయిన్ మీరా చోప్రా సిటీ పోలీసులతో పాటు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆస్క్ మీరా అనే హ్యాష్ ట్యాగ్తో ట్విట్టర్ అభిమానులతో ముచ్చటించిన మీరాని ఓ నెటిజన్ మీ ఫేవరేట్ హీరో ఎవరని అడగగా, మహేష్ అని చెప్పింది. ఎన్టీఆర్ గురించి ఏదైన చెప్పండి అనగానే అందుకు మీరా..నాకు ఎన్టీఆర్ గురించి తెలియదు. ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమానిని కాదు అని అంది. దీంతో హర్ట్ అయిన జూనియర్ ఫ్యాన్స్ మీరాని ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో వేధింపులు భరించలేక హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది.
ఆ నెటిజన్లపై చర్య తీసుకోవాలంటూ ట్విట్టర్ను సైతం ట్యాగ్ చేసింది. కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తుండటంతో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను దూషించిన వారందరూ ఎన్టీఆర్ అభిమానులు కావడం దురదృష్టకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొందరు పచ్చిగా తిడుతూ చేసిన ట్వీట్లను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు పంపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మీరా చోప్రా ఫిర్యాదుతో అసభ్య ట్వీట్లను పోలీసులు తొలగించారు.
అయితే ఇలాంటి సమయంలో సీనియర్ నటి కుష్బూ ఎన్టీఆర్ అభిమానులకు అండగా నిలిచారు. స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని అయిన ఖుష్బూ.. పరోక్షంగా మీరా ప్రవర్తనను తప్పుబట్టారు. ''కొంత మంది ఆడవాళ్లు ఎప్పటికీ మారరు లేదా ఏమీ నేర్చుకోరు. వాళ్లను అలానే ఉండనివ్వండి'' అని ఖుష్బూ ట్వీట్ చేసారు. ట్వీట్లో ఆమె పేరు వాడకపోయినా.. ఇది మీరాను ఉద్దేశించేనని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని కామెంట్ల ద్వారా చెబుతున్నారు. అయితే ఖుష్బూకి ధన్యవాదాలు చెబుతున్నారు... ఆమె తమకు అండగా నిలిచినందుకు ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.