Tollywood: మహేష్‌-రాజమౌళి సినిమాకు మొదలైన లీకుల బెడద.. నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న వీడియో..!

Tollywood: రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Update: 2025-03-10 03:56 GMT

Tollywood: మహేష్‌-రాజమౌళి సినిమాకు మొదలైన లీకుల బెడద.. నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న వీడియో..!

Tollywood: రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. అయితే సినిమా చిత్రీకరణ మాత్రం ప్రారంభమైంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు లీకుల బెడద మొదలైంది. ‘SSMB29’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో ఈ సినిమా ప్రారంభ షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందని కూడా నెట్టింట కొన్ని వార్తలు వచ్చాయి. వీటి గురించి చిత్ర యూనిట్‌ స్పందించకపోవడంతో అంతా గందరగోళంగా ఉంది.

కాగా ఆదివారం జరిగిన చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలను ఎవరో ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరడంతో ‘SSMB29’ హ్యాష్‌ట్యాగ్‌ ఎక్స్‌ ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుంది. ఈ పరిణామంపై స్పందించిన చిత్ర బృందం వెంటనే చర్యలు చేపట్టి ఆ వీడియోలను డిలీట్‌ చేయిస్తోంది. ఆ క్లిప్స్‌ ద్వారా మహేశ్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

మహేశ్‌బాబు లుక్‌ బయటకు పొక్కకూడదని టీమ్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా అధికారికంగా షూటింగ్‌ మొదలైనట్టు ప్రకటించలేదు. తాజా ఘటన నేపథ్యంలో భద్రత మరింతగా కట్టుదిట్టం చేసినట్టు సమాచారం. మార్చి 28 వరకు తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ్‌ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన లోకేషన్లలో చిత్రీకరణ జరగనుంది. తోలోమాలి పర్వతంపై ప్రత్యేక సెట్‌ కూడా రూపొందించారు. ప్రియాంక చోప్రా త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ కానున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News