వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ వెలువడింది. వాట్సాప్ భయంకరమైన వైరస్ బారిన పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఆందోళన చెందుతున్నారు. కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఒక స్పై వేర్ కొన్ని మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించింది. దీని కారణంగా ఫోన్ల కెమెరాలను నియంత్రించి వాటిని నిఘా పరికరాలుగా మార్చేయగలదట. జర్నలిస్టులు, లాయర్లు, మానవహక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఈ స్పైవేర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన వాట్సాప్ కంపెనీ..
వీలైనంత త్వరగా వాట్సాప్ గ్లోబల్ 1.5 బిలియన్ల యూజర్లు వెంటనే తమ యాప్ను అప్డేట్ చేసుకోవాలని కోరింది. యూజర్ జోక్యం లేకుండా వాట్సాప్ కాల్స్ లో మాలావేర్ ఎటాక్ చేసిందని వాట్సాప్ ప్రతినిధి ధృవీకరించారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే అడ్వాన్స్డ్ సైబర్ యాక్టర్ దీన్ని రూపొందించినట్లు తెలిపారు. కాగా ఇది చాలా భయానకమైన సైబర్ ఎటాక్ అని ఇంటర్నెట్ వాచ్డాగ్ సిటిజెన్ ల్యాబ్ ప్రతినిధి జాన్ స్కాట్-రైల్టన్ చెప్పారు. ఈ మాల్వేర్ ఎక్కువగా ఐఫోన్లను, గూగుల్ ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్లను టార్గెట్ చేసుకుందని తెలిపారు.