నిద్ర అనేది మానవుడికి అత్యంత అవసరమైనది. ప్రతి ఒక్కరు నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. పిల్లలు, వృద్ధులు అయితే 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు బాగా తినేసి ఎక్కువగా నిద్రిస్తుంటారు. అయితే ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. అవసరానికి మించి ఎక్కువగా నిద్రపోయేవారు భవిష్యత్లో స్థూలకాయం, తలనొప్పి, మధుమేహం, వెన్నునొప్పి, గుండె సమస్యలు ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో ఈ నిజాలు తేలాయట. వైద్యులు అతిగా నిద్రపోవద్దని చెప్తుంటారు. అయితే ఈ అతినిద్రను మామూలుగానే కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకోసం సూర్యరశ్మి మీ శరీరానికి తగిలేటట్టు చూసుకోవాలి. నిద్రకీ ఓ సమయాన్ని పెట్టుకోవాలి. వారాంతాల్లో, సెలవులలో కూడా ఆ సమయానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నించాలి. కొన్ని రకాల మందుల వల్ల కూడా అతినిద్ర సమస్య తలెత్తుతుంది. అందుకే మీరు ఏదైనా మందులు వాడుతున్నట్లైతే... వెంటనే మీ వైద్యున్ని సంప్రదించి ఈ సమస్యను తెలపండి.