ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రజలను ఊబకాయ సమస్య ఇబ్బంది పెడుతోంది. అధిక బరువు కారణంగా ఎన్నో అవస్థలు పడుతున్నారు. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నో పద్ధతులు పాటిస్తున్నారు. నాజూగ్గా తయారయ్యేందుకు యోగా సెంటర్ల, ఫిట్నెస్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు..అయితే అధిక బరువు తగ్గాలంటే.. వ్యాయామం మాత్రమే కాదు...ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. బరువును పెంచే ఆహారాలు కాకుండా బరువును తగ్గించే ఆహారాలు తినాలి. ఇక బరువును తగ్గించే ఆహారాల విషయంలో పండు మిరపకాయలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. పండు మిర్చి తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని అమెరికాలోని వెర్మోంట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు వారు 16 వేల మందిపై పరిశోధనలు చేశారు. దీంతో తేలిందేమిటంటే.. పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు నిర్దారించారు. అలాగే పండు మిరపకాయలను బాగా తినేవారికి హార్ట్ ఎటాక్లు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. పండు మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి శరీరంలో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీంతో మనకు ఆయుష్షు కూడా పెరుగుతుంది.