ఎండలు దంచికొడుతున్నాయి.సూర్యుడి ప్రతాపం వల్ల శరీరంలో వేడి చేస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అయితే శరీరంలో వేడి చేయకుంగా ఉండేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలతో వేడికి చెక్ పెట్టేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్రతో ఉపశమనం: గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్రను, కొద్దిగా పటిక బెల్లంను వేసి 2-3 గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత ఆ నీటిని వడబోసి తాగాలి. జీలకర్ర, పటిక బెల్లం వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. రోజుకు రెండు సార్లు ఇలా ఆ నీటిని తాగితే వేడితో సమస్యలు ఉండవు. మరో విధంగా కూడా ఈ చిట్కాను అమలు చేసుకోవచ్చు. జీలకర్ర, పటిక బెల్లాన్ని సమానంగా తీసుకొని మిక్సీ లో పట్టాలి. ఆ పొడిని డబ్బాలో ఉంచి, గ్లాసు నీటిలో టీ స్పూన్ మేర పోడిని కలుపుకొని రోజు తాగాలి. రోజుకు కనీసం రెండుసార్లు ఇలా తాగితే అతి వేడితో సమస్యలు ఉండవు.
నీరు ఎక్కువగా తాగడం: ఎండ వేడినుంచి తప్పించుకోవడానికి సులువైన మార్గం నీటిని ఎక్కువగా తాగడం. ఇది సులభమైన పద్దతి. నీరు ఎక్కువుగా తీసుకోవడం ద్వారా అతి వేడిని దరిచేరనివ్వదు. ఫ్రిడ్జ్ ఉన్న నీరు కాకుండా కుండలోని నీరు తాగడం మంచిది.
చెమట పొక్కులకు తేనె మందు: వేడి కారణంగా చిన్నపిల్లలకు చర్మంపై చెమట పొక్కులు వస్తాయి. ఇవి వారిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. వాటిని తగ్గించడం సులువే. నీటిలో ఒక టీ స్పూన్ తేనెను కలిపి రాత్రంతా నానబెట్టాలి. దాన్ని ఉదయాన్నే పరగడుపున పిల్లలకు తాగించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చెమట పొక్కుల తగ్గుతాయి.
మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం: రోజుకు 2-3 సార్లు మజ్జిగ తాగడం మంచిది . దానిలో నిమ్మరసం పిండుకొని తాగాలి. ఇది వేడి నుంచి త్వరగా ఉపశమనం కల్పిస్తుంది. తరచూ కొబ్బరి నీరు తీసుకున్నా కూడా మంచి ఫలితముంటుంది.
సబ్జా గింజలు: ప్రతి రోజు సబ్జా గింజల తీపుకోవడం ద్వారా ఒంటిలోని వేడిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. 3-4 టీ స్పూన్ల సబ్జా గింజలను తీసుకొని 4 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. వాటికి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఆలా యాడ్ చేసుకున్న ద్రవాన్ని తాగడం ద్వారా బాడీలోని వేడిని తగ్గించుకోవచ్చు. అదనంగా తేనెను కలుపుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి.
రోజు సబ్జా గింజల డ్రింక్ తీసుకుంటే బాడీ హీట్ వేగంగా తగ్గుతుంది. ఆరోగ్యానికి ఇతర ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ డ్రింక్ లో టేస్ట్ కోసం తేనెను కూడా కలుపుకోవచ్చు.