విజయనగరం జిల్లాలో సర్వేలు కలకలం రేపుతున్నాయి. నిన్నటి నుంచి కొందరు వ్యక్తులు ట్యాబ్లల్లో ఓటరు లిస్టును పెట్టుకుని పేర్లను తొలగిస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కుమిలి గ్రామంలో సర్వే చేస్తున్న వారిని అడ్డుకున్న వైసీపీ నాయకుడు మజ్జి శ్రీను ఆ ట్యాబ్లను లాక్కోడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో పోలీసులు మజ్జి శ్రీను ఇంటికి చేరుకుని ఆయన్ని అరెస్ట్ చేశారు. విజయనగరంలో సర్వే వ్యవహారంపై వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఓట్లు తొలగిస్తున్న వారిని కాకుండా అడ్డుకున్న వారిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. వ్యవహారంపై కాసేపట్లో ఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.