ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా పర్యటించిన జగన్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇందుకోసం విజయశంఖారావం పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నెల 6 నుంచి విజయశంఖారావం సమావేశాలు ప్రారంభం అవుతాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ జోరు పెంచారు. ఇప్పటికే తటస్థులను ఆకర్షించేందుకు వారికి లేఖలు రాసి భేటీలు జరుపుతున్న ఏపీ విపక్షనేత తాజాగా బూత్ లెవెలో కార్యకర్తలను సమాయత్తం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. బూత్ కన్వీనర్లు, కమిటీల సభ్యులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా దిశానిర్దేశం చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులతో జగన్ జరిపే సమావేశాలకు తొలుత సమర శంఖారావం అనే పేరు ఖరారు చేశారు. అయితే ఇప్పుడు పేరు మార్చి విజయ శంఖారావం అని పెట్టారు. పిబ్రవరి 6వ తేది నుంచి విజయ శంఖారావం సమావేశాలు ప్రారంభమవుతాయి.
గత ఎన్నికల అనుభవాల దృష్టా బూత్ కమిటీలను పటిష్టం చెయ్యాలని బావిస్తున్న వైసీపీ జగన్తో సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. బహిరంగ సభలా కాకుండా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో ఈ సమావేశాలు జరుపుతారు. మొదటి విడతలో 3 జిల్లాల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 6న చిత్తూరు జిల్లా బూత్ కమిటీలతో జగన్ సమావేశం అవుతారు. అలాగే 7న కడప జిల్లా, 10న విశాఖ పట్నంలో ఈ బూత్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. జిల్లాల్లో పార్టీ పటిష్టత, ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, కార్యకర్తల అభిప్రాయం, ప్రజలు ఏమనుకుంటున్నారు వంటి విషయాలను జగనే స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఈ నెల 14న అమరావతి పరిధిలోని తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం పూర్తయ్యాక కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో భేటీ అయ్యే అవకాశముంది.