నేడు మోడీతో జగన్ భేటి ..

Update: 2019-05-26 01:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు.

ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలపనున్నారు.

ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోదీకి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా హస్తినకు వెళ్తారు. మోదీతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్‌ జగన్‌ ఏపీ భవన్‌కు చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు జగన్‌ వెళ్తారు. అక్కడ జగన్‌ను ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. 

Similar News